'గాంధీ ఇండియా' ను 'గాడ్సే ఇండియా' గా మార్చడం వాళ్ళ లక్ష్యం! ఈ 'మత సాంస్కృతిక' ముసుగు వెనక స్పష్టమైన కార్పోరేట్ రాజ్య స్థాపన లక్ష్యం వుంటుంది
‘గాంధీ ఇండియా’ ను ‘గాడ్సే ఇండియా’ గా మార్చడం వాళ్ళ లక్ష్యం! ఈ ‘మత సాంస్కృతిక’ ముసుగు వెనక స్పష్టమైన కార్పోరేట్ రాజ్య స్థాపన లక్ష్యం వుంటుంది. ఇది నిజానికి కార్పొరేట్ల కోసం కార్పొరేట్ల చేత నడపబడే ప్రభుత్వం. ఈ ‘మోడీ కార్పోరేట్ భారత్’ కి జియోనిస్టు ఇజ్రాయెల్ ఆదర్శం కాకుండా ఎలా ఉంటుంది?
అందుకేనెమో, ఫ్రాన్స్ ‘మిగ్’ తో చిరకాలపు తియ్యని బంధం చేదుగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలపు కమ్మటి రష్యా ‘మిరేజ్’ బంధం వెగటు పుట్టించింది. దశాబ్దాల ‘జాగ్వార్’ బంధంతో పాటు తదనంతర కొత్త ‘రాఫెల్’ బంధం కూడా వాళ్లకు రుచించలేదేమో! ఈ సర్వ అనుబంధాలు, బంధాలు, సంబంధాల్ని గాలిలో కలిపేన్నారు. ఓ జాతి నిర్మూలన కోసం చేపట్టిన పరమ ఫాసిస్టు రాజ్యంతో కొత్త సైనిక సంబంధాల అవసరం ఏర్పడుతోంది. వర్తమాన ‘కార్పోరేట్ భారత్’ రేపటి పూర్తిస్థాయి ‘ఫాసిస్టు భారత్’ గా మార్చాలంటే ఓ ‘నెత్తుటి భారత్’ మజిలీ ద్వారానే ఆవిష్కరణ జరుగుతుంది. అందుకై ఇజ్రాయెల్ తో సరికొత్త బంధమేమో యిది.
పూర్తిస్థాయి కాపీటలిస్టు జర్మనీ స్థాపన ఆనాటి హిట్లర్ ప్రభుత్వ వాస్తవ లక్ష్యం! అందుకోసం అది యూదురహిత పరిశుభ్ర జర్మనీ జాతి రాజ్య స్థాపన లక్ష్యాన్ని బయటకు ప్రకటించింది. అందుకై నెత్తుర్లు పారించింది.
పూర్తి కార్పొరేట్ల భారత్ నిర్మాణమనే నిజ లక్ష్యం నేటి ఆర్.ఎస్.ఎస్.లక్ష్యం! అందుకై ముస్లిం రహిత, క్రిస్టియన్ రహిత పవిత్ర హిందుత్వ రాజ్య స్థాపన లక్ష్యాన్ని మోడీ సర్కారు చేపట్టింది. ఇందుకోసం దీనికి కూడా నెత్తుర్లు పారించే అవసరం ఉంది.
విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ నెత్తుర్లు పారించిన హిట్లర్ బాధిత యూదులకు నేడు హిట్లర్ సరికొత్త ఆదర్శం కావడం! ఆ యూదు మత రాజ్యం నేటి మోడీ సర్కారుకి ఆదర్శం కావడం! మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆర్.ఎస్.ఎస్. కి తొంబై ఏళ్ల క్రితం హిట్లర్ ఆదర్శమైతే, ఇప్పుడు నేతన్యాహూ ఆదర్శంగా మారడం! నాటి హిట్లర్ హంతక రాజ్యం నాటి గాడ్ ఫాదర్! నాటి హతుల జాతితో ఏర్పడ్డ రాజ్యం నేటి గాడ్ ఫాదర్!
ఫాసిజం హఠాత్తుగా ఊడిపడేది కాదు. అదో పరిణామక్రమం. దాని దశల్ని నిచ్చెనమెట్లతో పోల్చితే ముస్సోలినీ, హిట్లర్ శిఖర మెట్లకు చేరారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మెట్లు ఎక్కింది. మిగిలిన మెట్లు ఎక్కే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసం వ్యూహాత్మక పథకాల్లో మునిగింది. ఈ దేశ ప్రజలు మెట్ల మీది నుండి పడదోయకపోతే… అంతిమంగా కుక్కచావు చచ్చిన ముస్సోలినీ, హిట్లర్ ఎక్కిన వరకూ నిచ్చెన తుది మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తారు. వారికి ఇజ్రాయెల్ మార్గదర్శకం కాకుండా ఎలా ఉంటుంది?
ఇప్పుడు మూడు పట్టికల్ని అందిస్తున్నా. వాటిని నిశిత దృష్టితో పరిశీలిద్దాం. ఫాసిస్టు ఇజ్రాయెల్ తో మోడీ కార్పోరేట్ భారత్ సైనిక బంధాన్ని గ్రహిద్దాం.
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
7-12-2023