విధాత : ఖరీదైన ఉప ఎన్నికగా దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందిన మునుగోడు నియోజకవర్గం మరోసారి ఆసక్తికర ఎన్నికల పోరుకు వేదిక కాబోతుంది. గత ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరి మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో గత ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి స్రవంతి, ఆశావహులు చలమల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్ల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనని భావిస్తున్నారు.
కాంగ్రెస్ టికెట్ రాజగోపాల్రెడ్డికి దక్కితే, ఆయన 2018, 2022 ఉప ఎన్నికల తర్వాతా వరుసగా మూడోసారి బీఆరెస్ అభ్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో తలపడనున్నారు. అయితే ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు బీఆరెస్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తనకు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తితో బీఆరెస్ను వీడి బీజేపీలో చేరాడు. ఇప్పుడు బీజేపీ మునుగోడులో బలమైన అభ్యర్థిని పోటీలోకి దించే యోచనతో బూరకు టికెట్ ఇచ్చేందుకు సిద్దపడినట్లుగా తెలుస్తున్నది. అదే జరిగితే ఈ దఫా మునుగోడు ఎన్నికల పోరు మరోసారి రసవత్తరంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.
మునుగోడు నియోజవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య మెజార్టీగా ఉంది. దీంతో బీఆరెస్, కాంగ్రెస్ ల నుంచి తమకే టికెట్లు కావాలన్న డిమాండ్ ను మొదటి నుండి కూడా ఆ పార్టీల్లోని బీసీ నేతలు బలంగా వినిపిస్తునే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్ బరిలోకి దిగితే ఆయనకు తన గౌడ సామాజిక వర్గంకు చెందిన 35వేలకు పైగా ఓటర్లతో పాటు నియోజకవర్గంలో బలంగా ఉన్న పద్మశాలి ఓటర్లు, ముదిరాజ్, యాదవ, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ తదితర బీసీ సామాజిక ఓటర్ల నుంచి బూర నర్సయ్యకు తప్పనిసరిగా మద్దతు లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తున్నది. అదిగాక బీఆరెస్లో ఉన్నప్పుడు నియోజకవర్గం బీసీ నేతలతో కలిసి బీసీలకు టికెట్ల కావాలంటూ బూర అప్పట్లో కేసీఆర్పై తీవ్ర స్తాయిలోనే ఒత్తిడి చేశారు. బూర బరిలో ఉంటే కూసుకుంట్లపై అసంతృప్తితో ఉన్న బీఆరెస్ బీసీ నాయకులు, బీసీ ఓటర్లు బూరకు మద్దతుగా నిలుస్తారని బీజేపీ అంచనా వేస్తుంది.
మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 66.2శాతం మంది ఉన్నారు. ఎస్సీలు 15.6శాతం, ఓసీలు 8.9శాతం, ఎస్టీలు 5.7, మైనార్టీలు 3.5శాతం ఓటర్లు ఉన్నారు. వీరిలో గౌడ సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా 16.7శాతం, గొల్ల, కురుమలు 15.4, ముదిరాజ్లు 15.2శాతం, పద్మాశాలిలు 8.4శాతం, వడ్డెరలు 3.6, విశ్వబ్రాహ్మణ 3.4,కుమ్మరి 3.4శాతం ఓటర్లు ఉన్నారు. మాదిగలు 11శాతం, మాలలు 4.6శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఓసీలలో రెడ్డిలు 3.3శాతం, కమ్మ 2.1, వెలమ 1.0, వైశ్య 1.6 ఓటర్లు ఉన్నారు.
మళ్లీ సీపీఐదే కీలక భూమిక
ఉప ఎన్నికల మాదిరిగానే ఈ దఫా ఎన్నికల్లోనూ మునుగోడు ఫలితం తేల్చడంలో కమ్యూనిస్టులు మరోసారి కీలక భూమిక పోషించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్రెడ్డిని ఓడించేందుకు బీఆరెస్తో జట్టుకట్టిన కమ్యూనిస్టులు ఈ దఫా కాంగ్రెస్లో పొత్తు కుదిరిన పక్షంలో మిత్రపక్షంగా అదే రాజగోపాల్రెడ్డిని గెలిపించాల్సిన అనివార్య పరిస్థితిని ఎదుర్కోనున్నారు.
కాంగ్రెస్తో పొత్తులో భాగాంగా కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐకు కేటాయించడం, దాదాపుగా అంగీకరించడం జరిగిందని పార్టీ సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. నల్లగొండ జిల్లా నాయకత్వం మాత్రం మునుగోడు సీటును తమకు కేటాయించాలని, లేదంటే స్నేహపూర్వక పోటీ చేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అయితే వారికి సీపీఐ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు నచ్చచెప్పే అవకాశం లేకపోలేదు.
మునుగోడులో వెలమ..రెడ్లదే ఆధిపత్యం
1967, 1972,1978, 1983ఎన్నికల్లో వరుసగా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి గోవర్ధన్రెడ్డి గెలుపొందారు. 1985, 1989, 1994లో వెలమ సామాజిక వర్గంకు చెందిన ఉజ్జిని నారాయణరావు మూడుసార్లు సీపీఐ నుంచి గెలుపొందారు. 1999లో తిరిగి 1999లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, 2004లో సీపీఐ నుంచి పల్లా వెంకట్ రెడ్డి, 2009లో సీపీఐని ఉజ్జిని యాదగిరిరావు, 2014లో బీఆరెస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, 2018లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2022ఉప ఎన్నికల్లో బీఆరెస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
మొత్తం గత 13 ఎన్నికల్లో 9సార్లు రెడ్లు, నాలుగుసార్లు వెలమ అభ్యర్థులు ఆ రెండు పార్టీల నుంచి గెలుపొందారు. అందుకే ఈ నియోజకవర్గంలోని బీసీలలో తమకు ఇంకెప్పుడు అవకాశమిస్తారన్న అసంతృప్తి రగులుతున్నది. ఈ నేపధ్యంలో బీజేపీ బీసీ అభ్యర్ధిగా బూర నర్సయ్యగౌడ్ను బరిలోకి దింపితే కూసుకుంట్లకు, రాజగోపాల్రెడ్డికి, బూరకు మధ్య త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.