వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ప్రారంభమైంది
ఈనెల 27న పోలింగ్
విధాత : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.10న నామినేషన్ల పరిశీలన, 13వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్లు లెక్కించనున్నారు. ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. కాగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.