ప్రధాని నరేంద్రమోదీ ఈ దశాబ్దకాలంలో తెలంగాణకు చేసిందేమిటీ? చేయాల్సిందేమిటనే ఊసే లేకుండా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది
రంగు రాజకీయం…అధికార పీఠం
ప్రధాని మోదీ ప్రచార ప్రసంగం
సీఎం రేవంత్ ప్రశ్నలకు జవాబులేదు
ఆరూరి ఆవేదన పై పట్టింపు కరువు
ప్రధాని పై కాంగ్రెస్, బీఆరెస్, సీపీఐ ఫైర్
దశాబ్ద నిర్లక్ష్యానికి బాధ్యులెవరూ?
-విధాత ప్రత్యేక ప్రతినిధి:
రెండు పర్యాయాలు అంటే పదేండ్లు అధికారం చెలాయించిన బీజేపీ. ప్రధాని నరేంద్రమోదీ ఈ దశాబ్దకాలంలో తెలంగాణకు చేసిందేమిటీ? చేయాల్సిందేమిటనే ఊసే లేకుండా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పదేండ్లు తామే అధికారంలో ఉండి మూడవసారి ముచ్చటగా మరోసారి అధికారం కట్టబెట్టాలనే యావ తప్ప. రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని ప్రాంతాలకు చేసిందేమిటనే ప్రశ్నలకు కనీస సమాధానం చెప్పకుండా ఫక్తు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానిగా మోదీ వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చేసిందేంటో చెబితే బాగుండేదీ. కానీ, దేశంలో పదేండ్ల క్రితం అధికారం కోల్పోయి, నాలుగు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం తప్ప ఇతరత్రా నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదల గురించి ఒక్క మాట మాట్లకపోవడం ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి అదనంగా ఏం చేయకపోయినా గత సర్కారు ఇచ్చిన రాష్ర్ట విభజన హామీలు కూడా అమలు చేయని అంశాన్ని పక్కదారి పట్టించారు. ఎక్కడో అమెరికాలో కాంగ్రెస్ ప్రతినిధి చర్మం రంగులపై చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఓటు బ్యాంకుకు వినియోగించుకునేయత్నం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత విభజన హామీలకు ఇవ్వలేదు. మతపరమైన అంశాలు, ఇతరత్రా వాటికిచ్చిన ప్రాధాన్యత ఈ ప్రాంతాభివృద్ధి గురించి నిరుద్యోగులు ఉపాధి కోసం తల్లడిల్లుతున్న అంశాల పై మాట్లాడకపోవడం పట్ల విమర్శిస్తున్నారు. మంగళవారం సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా బీజేపికి, మోదీకి సంధించిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. చివరికి మొన్న బీఆరెస్ లో ఉండగా, ఇప్పుడు బీజేపీ అభ్యర్ధిగా అరూరి రమేష్ వేదికపై వెలుబుచ్చిన ఆవేదనను పట్టించుకోలేదు. సభలో ఆయన వరంగల్ కు సంబంధిన అభివృద్ధి అంశాలు ఏకరువుపెట్టినా మోదీ నుంచి కనీస స్పందన రాలేదు. మోదీ పర్యటన, ఆయన ప్రసంగం పై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోదీ పర్యటన పై బీఆరెస్ నాయకులు బండా ప్రకాష్, వినయ్ భాస్కర్, రాజయ్య తదితరులు మండిపడుతున్నారు. సీపీఐ నాయకులు శ్రీనివాసరావులు మోదీ తీరును దుయ్యబడుతున్నారు. మోదీ ప్రసంగం, ఈ ప్రాంతానికి పదేండ్లు ఏం చేశారనేది పక్కనపెడితే వచ్చే పర్యాయమైనా పట్టించుకుంటామనే భరోసా ఇవ్వకపోవడం బీజేపీ వర్గాలను సైతం తీవ్ర నిరాశకు లోనుచేసింది.
రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు రావాల్సిన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. పార్లమెంటులో ప్రకటించిన ఈ హామీలు దశాబ్దకాలం పూర్తైయినా అమలుకునోచుకోలేదు. కాలపరిమితి ముగిసినందున ఈ హామీలు అటకెక్కినట్లేనా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా కనబరుస్తున్న నిర్లక్ష్యంపై విపక్షపార్టీలు కన్నెర్ర చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఎజెండాగా మారి తెలంగాణ ప్రజలకు ఆయుధంగా మారింది. ప్రచారంలో బీజేపీని ఇబ్బందికి గురిచేస్తోంది. విభజన హామీలకే దిక్కులేదంటే, పదేండ్లలలో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదంటున్నారు. జిల్లా ప్రజలు మోదీ తీరు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పదేళ్ళుగా జిల్లాలో వివిధ రూపాల్లో ఈ అంశాన్ని రాజకీయ పక్షాలు లేవనెత్తుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్, సోయంబాపురావులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
విభజన హామీల్లో మూడు వరంగల్ జిల్లాకు సంబంధించినవి కావడం గమనార్హం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విభజన హామీలల్లో ఉమ్మడి జిల్లాకు చెందినవి ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించి మోదీ వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీని తెరపైకి తెచ్చి జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంచేసినప్పటికీ ఎవరూ అంగీకరించలేదు. ఇటీవల గిరిజన యూనివర్సీటీకి అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వం 331 ఎకరాల భూమిని కేటాయించగా, కేంద్రం పదేండ్లు పండబెట్టి ఎన్నికల సందర్భంగా ప్రకటనలు చేశారు. ఉక్కు పరిశ్రమను తుక్కులో చేర్చారు.
తెలంగాణలో ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని స్పష్టంగా ఉన్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో దేనికి జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వాటాలను ఇంకా తేల్చలేదు. తాత్కాలిక కేటాయింపులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నందున తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది. తెలంగాణకు సగం వాటా రావాల్సి ఉండగా పరిష్కారం పదేండ్లుగా పడకేసింది. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఐటీఐఆర్ను పథకాన్ని రద్దు చేశారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల్లో వివక్ష, వైద్య కళాశాలలు, నవోదయ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపిలో ఏకపక్షంగా కలిపారు.
విభజన హామీల వైఫల్యానికి ప్రధాని మోదీని రాష్ట్ర రాజకీయ పక్షాలు టార్గెట్ చేశాయి. హామీల అమలులో ప్రధానిగా నిర్లక్ష్యం చేసినందున ఆ పార్టీకి వ్యతిరేకంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో విభజన హామీలు మరోసారి ఎజెండాపైకి వచ్చాయి. ప్రజలను వంచించిన బీజేపీ, మోదీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతల మౌన ప్రేక్షపాత్ర వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.